www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

కోటప్పకొండ

ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యస్థలాలలో కోటప్పకొండ ఒకటి. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పట్టణానికి 13 కి.మీ. దూరంలోగల ఈ క్షేత్రానికి ఏ ప్రాంతం నుండైనా సులభంగా చేరవచ్చు. రైలు మార్గంలో అయితే గుంటూరు - గుంతకల్లు మార్గంలోని పిడుగురాళ్ళలో దిగి అక్కడనుండి గంట ప్రయాణంతో నరసరావుపేటకు చేరి ఈ ఆలయాన్ని దర్శించవచ్చు. నరసరావుపేట నుండి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం, ప్రైవేటువాహన సౌకర్యం వున్నాయి.

క్షేత్ర వైభవం

చతుర్దశ భువనాలు శివమయ సంధానాలు, మంగళకరమగు శివ శబ్దము సకల చరాచర జీవకోటికి ఆధారము. పరమేశ్వరుడు ఆది అంతాలు లేని సర్వవ్యాపనమైన చైతన్య శక్తి. అట్టి శక్తికి గుర్తు గుండ్రని రూపం. అందుకే శివుడిని లింగాకారంగా అర్చన చేస్తున్నాం. ఆ లింగమే త్రికోటేశ్వరుడు. ఆయనే కోటప్ప. అంతటి మహొత్కృష్టమైన క్షేత్రమే త్రికూటాచలం. అదియే కోటప్పకొండ. పవిత్రమైన చారిత్రక క్షేత్రాలలో కోటప్పకొండ ప్రసిద్ధమైన అతి ప్రాచీన శైవక్షేత్రం.

కృత, త్రేతా, ద్వాపరయుగాల నుండి పుణ్యభూమిగా పరిగణింపబడుచున్న భారతదేశంలోని దక్షిణ భాగంలో అపర కైలాస క్షేత్రంగా పేరొందిన త్రికోటేశ్వరస్వామికి నిలయమైన దివ్యభక్తపధము కోటప్పకొండ. పిలిచిన పలికే ప్రసన్న కోటేశ్వరునిగా, భక్తుల కోర్కెలు తీర్చే ఎల్లమంద కోటేశ్వరునిగ కష్టాల నుండి కడదేర్చే కావూరు త్రికోటేశ్వరునిగ, ఆపదలలో ఆదుకునే చేదుకో కోటయ్యగా, సంతతిలేనివారికి సంతానాన్ని కలుగచేసే సంతాన కోటేశ్వరునిగా యుగయుగాల నుండి నేటి వరకు భక్తుల ఆరాధ్యంగా విరాజమానమగుచూ కోరిన వారికి కొంగు బంగారంగా నిత్యార్చనాభిషేకాదుల నందుకుంటూ కోటి ప్రభలు విరజిమ్ముతూ సుఖము, శాంతి, ఆరోగ్యము, ఐశ్వర్యము, రక్షణ, శుభము, విజయము అవలీలగా అనుస్యూతంగా ప్రసాదించే శ్రీమత్త్రికోటేశ్వర  సన్నిధానం కోటప్పకొండ మహాక్షేత్రం.

కోటప్పకొండ చరిత్ర

దక్షయఙ్ఞ విధ్వంసానంతరం లయకారుడైన శంకరుడు శాంతివహించి యోగనిష్ఠతో 12 సం|| వటువుగా దక్షిణామూర్తి అవతారంలో సకల దేవతలతో కూడి ఈ  త్రికూటాద్రిపై నివసిస్తూ మధ్యమ శిఖరమైన "రుధ్రశిఖరమున బిల్వవనాంతర్గత వటవృక్షము క్రింద బ్రహ్మాసన స్ధితుడై, బ్రహ్మ విష్ణ్వాది సకల దేవతలకు, సనకసనందనాది పరమహంసలకు, నారదాది దేవర్షులకు వాలఖాల్యాదియోగ సిద్ధులకు, వశిష్ఠాది మహర్షులకు, మేధాది రాజవర్యులకు బ్రహ్మొపదేశమిచ్చిన  ప్రదేశము, దివ్యపుణ్యధామము రుధ్రశిఖరము. ఇట మహాదేవుడు దక్షిణామూర్తి రూపంతో సమస్త దేవతలు సేవించి తరింప చిన్ముద్రధారుడై దర్శనమిచ్చెనని భక్తుల విశ్వాసం. యిదియే ప్రాచీన కోటేశ్వవరాలయం. ఇదియే పాత కోటప్ప గుడి.

రుద్రశిఖరానికి ఈశాన్య భాగాన ఓ శిఖరము గలదు. ఇదియే "గద్దలబోడు" లేక విష్ణుశిఖరం. దక్షాధ్వర సమయంలో శివరహితంగా తాము భుజించిన హవిర్భాగ దోష నివారణార్ధమై ఇంద్రాది దేవతలతో కూడి మహావిష్ణువు పరమేశ్వర సాక్షాత్కారానికై తప మాచరించగా ఈశ్వరుడు ప్రత్యక్షం కాగా తాము ఎల్లవేళలా అర్చించుకొనుటకు లింగరూపంతో ఈ శిఖరంపై నిలచి దర్శనమీయమని ప్రార్ధింప పరమేశ్వరుడు సమ్మతించి త్రిశూలంతో రాతిపై పొడిచి ఉదక ముధ్భవింపజేసి లింగరూపధారియై ఈ జలమందు స్నానమాచరించి నన్ను పూజించిన మీ పాపములు వినాశమగునని యానతిచ్చి అంతర్ధానుడయ్యాడు. ఆనంద పరవశులైన యింద్రాది దేవతలు ఈ జలమున స్నానమాడి పాప వినాశనులైరి.  అందువలన ఈ జలమునకు "పాపనాశన తీర్ధ" మని ఈ క్షేత్రమునకు "పాపవినాశన క్షేత్ర" మని లింగమునకు "పాపవినాశనలింగ" మని పేరు వచ్చింది. భక్తులు ప్రధమతహా నీ దివ్య స్థలాన్ని దర్శించి "ద్రోణిక" దొనయందు స్నానమాడి పవిత్రులై పాపనాశన లింగాన్ని పూజించి పిదప కోటేశ్వరుని దర్శించి తరించుట ప్రశస్తంగా రూపొందించబడినది. యింద్రాది దేవతలు సిద్ధ సాధ్యులు, గరుడ గంధర్వులు ఎల్లవేళలా ఈ శిఖరమున వసింతురని విశ్వాసము. కార్తీక, మాఘ మాసములందు పాపనాశమున స్నానమాచరించి లింగార్చన చేసిన వారికి భోగమోక్షములు సిద్ధించునని ప్రతీతి. రుద్రశిఖరమునకు నైరృతీభాగమున బ్రహ్మ యధిష్ఠించి యుండును. రుధ్ర, విష్ణు శిఖరముల యందు పూజనీయ లింగములుండి తన శిఖరమున లింగము లేకుండుటకు, బ్రహ్మ విచారించి ఈశ్వరుని గురించి తపమాచరింప మహేశుడు లింగరూపంలో వెలయడం జరిగింది. నేడు అర్చనల నందుచున్న మహిమాన్విత దివ్యరూపశిఖరము బ్రహ్మశిఖరము.  నూతన కోటేశ్వరుడు లింగరూప ధారియై నేటికిని అశేష ప్రజల పూజలందుకొనుచూ భక్తవశంకరుడై దర్శనమిస్తున్నాడు. దీనినే నూతన కోటేశ్వర క్షేత్రంగా ఆరాధిస్తారు.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in